ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఈ మేరకు విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు.ఇలాంటి దౌర్జన్యాలకు,రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని అన్నారు.
ఈ దాడి ఘటన గురించి అధికారులతో పవన్ చర్చించారు.కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని,బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు.జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల,ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ అన్నారు.మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించీ వాకబు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

