ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు రూ.20వేలు పంపిణీ చేస్తామని వివరించారు. టీసీఎస్ కు భూ కేటాయింపు నిర్ణయం. ఐటీని విస్తరించేందుకు ఐటీ మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలకు సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
క్యాబినెట్ నిర్ణయాలు:
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్సు కు ఆమోదం.
రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం. నిర్మాణం పనులు ఎల్-1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయం.
స్టేట్ సెంటర్ ఫర్ క్లైమెట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుకు ఆమోదం.
అర్బన్ ప్రాంతాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం.
విశాఖలోని ఐటీహిల్ -3 పైన ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ కు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
ఉరుస క్లస్టరు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమి కేటాయింపు నిర్ణయం.
30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం.
పలు ప్రాంతాల్లో విండ్ పవర్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం.