రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని ఆక్షేపించారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని షర్మిల ఆరోపించారు.
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ ? మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయాజాలమా ? అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి ? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని షర్మిల ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. ఆంధ్రపదేశ్ అంటే అన్నపూర్ణమ్మ. ధాన్యాగారానికి భాండాగారం. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు. ఆరుగాలం కష్టించి పడించే రైతుకు దక్కేది కన్నీళ్లు అయితే… బియ్యం అక్రమార్కులకు దక్కుతున్నవి కాసులు. ఇది మన రాష్ట్ర దుస్థితి అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin2 Mins Read
Previous Articleరామ్ గోపాల్ వర్మకు స్వల్ప ఊరట…!
Next Article ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ