సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా అధ్యక్షుడు జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి… జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి రిజిస్ట్రీ మార్చింది.
మరోవైపు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందు రఘురామ, జగన్, సీబీఐ తరఫున వాదనలు జరిగాయి. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు కుమ్మక్కయారని పేర్కొన్నారు. డిశ్ఛార్జ్ పిటిషన్లపై వాదనలు విని.. వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని తెలిపారు. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్పైనా తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ అవ్వడంలో కుట్రకోణం దాగి ఉందన్నారు. ఆ ఉద్దేశంతోనే తాము ట్రయల్ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు.