రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి అద్దం పట్టే ఆసక్తికర పరిణామం ఈరోజు మంగళగిరిలో చోటుచేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ల్యాండ్ అయింది. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారితో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా పంపిన కొండపల్లి బొమ్మల జ్ఞాపికలను తెలంగాణ మంత్రులకు బహూకరించి సాదరంగా సాగనంపారు.
జనసేన సెంట్రల్ ఆఫీస్ హెలీప్యాడ్ కి తెలంగాణ మంత్రులు… సాదరంగా ఆహ్వానించిన జనసేన నేతలు
By admin1 Min Read