దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజురోజు గాలి నాణ్యత క్షీణిస్తున్న మేరకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని యోచిస్తోంది.ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 కింద మరిన్ని నిబంధనలను ఈ రోజు నుండి అమలు చేయనున్నట్లు పేర్కొంది.ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరుగుతోంది.దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ వెల్లడించారు.
నేటి నుండి అమలు కానున్న నిబందనలు ఇవి
1.ఢిల్లీలోకి నిత్యవసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహాయించి, మిగిలిన వాటికి ప్రవేశాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్,బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతి.ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం.
2.అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
3.రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.
4.ఎన్ఆర్సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫార్సు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది.

