భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు.ఈ ప్రతిష్టాత్మక పదవికి నియమితులైన మొదటి తెలుగు వ్యక్తి ఆయనే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను 15వ కాగ్ జనరల్ గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన గిరీశ్చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం లభించింది. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి అవకాశం ఉంది.
1964 డిసెంబరు 24న జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు ఎంపికై, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుండి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు.ఆయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు.కే ఎస్ ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఐఏఎస్ అధికారిగా వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా, సంజయ్ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.
ప్రతిష్టాత్మక హోదాలో తెలుగు వ్యక్తి:’కాగ్’ జనరల్ గా నియమితులైన సంజయ్ మూర్తి
By admin1 Min Read