కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి వివరించారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను వరుసగా కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దల ముందు ఉంచిన పవన్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాలను ప్రధానికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరాలను ప్రధాని మోడీకి తెలిపారు. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకొని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్ ను తయారు చేసింది. పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది తమ ఆశయమని విజ్ఞప్తి చేశారు.
జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాం.. సహకరించండి: ప్రధాని మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ
By admin1 Min Read