తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఇదో చారిత్రాత్మక ఘట్టమని ఏపీసీసీ చీఫ్ షర్మిల కొనియాడారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలి. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలి. జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. మాజీ సీఎం జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని షర్మిల ఆరోపించారు. ఏపీలో కూడా వెంటనే కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
Previous Articleఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఏపీలో ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి
Next Article జపాన్ కు చెందిన ప్రముఖులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ