ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని విద్యా శాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయమని కొనియాడారు. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుందని పేర్కొన్నారు . సూపర్ – 6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాం. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతివిద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. ఈసారి బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు వెరసి 34,311 కోట్లు (గత ఏడాది కంటే రూ.2076 కోట్లు అధికం) కేటాయించడం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో మా చిత్తశుద్ధికి అద్దం పడుతోందని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తీసుకు రావాలన్న తన సంకల్పానికి బడ్జెట్లో తాజాగా కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయని వివరించారు. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని దీంతో ఏపీ యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆస్కారమేర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ విప్లవాత్మకమైన నిర్ణయం: ఏపీ మంత్రి నారా లోకేష్
By admin1 Min Read