ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. అమెరికా టారిఫ్ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? అని ఆరోపించారు. రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆక్వా రంగం కోసం చేసిన పనులు వివరించారు.వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి, ధరల పతనాన్ని అడ్డుకోవాలన్నారు. అమెరికా టారిఫ్ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయని ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదన్నారు.
Previous Articleసామాన్యుడిపై మరింత భారం…పెరిగిన వంట గ్యాస్ ధర…!
Next Article ఏ పార్టీకి ఎన్ని డొనేషన్స్?…ఏడీఆర్ నివేదిక