కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి లేదని రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదు పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట అని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో సెటైర్ లు వేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడం, AI పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబు గారికే తెలిసిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్ళీ అగ్గువకే కాజేసి, తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదని ఆమె ఆరోపించారు. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డు మా ఉద్దేశ్యం అంతకన్నా కాదు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ ? అని ప్రశ్నించారు. కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు , ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం ? సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ ? అని ప్రశ్నించారు. రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా..చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా ? ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి ? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు ? ఏ సంస్థలకు కేటాయించారు ? ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు ? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు.
రాజధాని 34 వేల ఎకరాలపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి: వైఎస్ షర్మిల
By admin2 Mins Read