ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ధారాళంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం గమనిస్తూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన భరోసానిచ్చారు.
ఇక మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కరెంట్ స్తంభాలు దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తనకు నివేదికలు పంపాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.
Previous Articleకేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో నారా లోకేష్ భేటీ
Next Article భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించిన శామ్ సంగ్