అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.అయితే ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుండి ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ గడువు ముగియనుంది.ఈ సందర్భంగా ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ కథనంలో తెలిపింది.ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది.అయితే ట్రంప్ సర్కారు ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని,భవిష్యత్తులో ఈ సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఓపీఎం నుండి ఒక మెమో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ-మెయిల్ వెళ్లింది.ఇందులో స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిన వారికి 8 నెలల జీతం ఇస్తామని తెలిపింది.ఫిబ్రవరి 6వ తేదీకి ముందు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నారు.అయితే దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.