రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బీజేపీ గత 10 ఏళ్లుగా మోసం చేస్తుందని ఆరోపించారు . రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం అంతే ముఖ్యమని పోలవరం ఆంధ్ర జీవనాడి. ఇవ్వాళ్టి వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదని దీనికి బాధ్యత ఎవరు? అని ప్రశ్నించారు. పోలవరం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారి కల అని ఆయన సీఎం అయ్యాక అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పుడు పనులు ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం రూ.10,151 కోట్లు. సామర్ధ్యం 194 టీఎంసీలు. ప్రాజెక్ట్ ఎత్తు 45.7 మీటర్లు. ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారని ఇలా కడితే పోలవరం జీవనాడి అవ్వదని ఆక్షేపించారు . చంద్రబాబు జగన్ పాలనలో ఈ ప్రాజెక్టు అనుకున్నంతగా ముందుకు సాగలేదని ఆరోపించారు.
41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో చెప్పడం లేదు. 41.15 మీటర్లు ఎత్తులోనే నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్సైట్లో పెడితే మన ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారు.ప్రాజెక్ట్ బ్యారేజ్గా…లిఫ్ట్ ఇరిగేషన్గా మిగిలి పోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర అని ఈ కుట్రలో భాగం బాబు, జగన్, పవన్. ఫేజ్ 1లో ఎన్ని ఎకరాలు… ఫేజ్ 2లో ఎన్ని ఎకరాలు అనేది కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పోలవరంలో R&R ప్యాకేజీ ఇవ్వాలి అంటే రూ.33 వేల కోట్లు కావాలి. దాదాపు 96 వేల కుటుంబాలకు ఇంకా రీహాబిలిటేషన్ చేయాలి. 85 వేల కుటుంబాలకు R&R ఇవ్వకుండా ఎత్తు తగ్గించడం కుట్ర అని ఆరోపించారు. కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. 45.7 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.