ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతితో సమావేశమైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు.
ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఈసందర్భంగా కేంద్రమంత్రికి తెలిపారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని వివరించారు. ఈ ప్రతిపాదననను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందని వివరించారు.
ఎర్రచందనం అరుదైన వృక్ష సంపదని ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్ గా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలని కోరారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుందని పవన్ వివరించారు.
ఎర్రచందనంకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read