ఏపీలో ఇటీవల పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గత ప్రభుత్వ పాలన విపత్తు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. గత పాలన ఓ విపత్తు అయితే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా ? అని షర్మిల ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ? ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు ? భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా ? అని ప్రశ్నించారు. 5 ఏళ్లపాటు జగన్ గారు మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా 5 ఏళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని షర్మిల మండిపడ్డారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం. రూ.3లక్షల కోట్లు ఇస్తాం, పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని పేర్కొన్నారు.గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే.. ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read