బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానపరిచాడన్న నేపంతో బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈరోజు ఆయన కేసు కోర్టులో విచారణకు రాగా,బంగ్లాదేశ్ లో ఒక్క న్యాయవాది కూడా ఆయన తరఫున వాదించేందుకు ముందుకు రాలేదు.కొన్ని రోజుల కిందట చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన తరఫున న్యాయవాది రీగర్ ఆచార్య కోర్టులో వాదనలు వినిపించారు.దీనితో రీగన్ ఆచార్యపై కొందరు వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడి చేశారు.రీగన్ ఆచార్యను బాగా కొట్టడంతోపాటు, ఆయన ఛాంబర్ ను కూడా ధ్వంసం చేశారు.
ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణ్ దాస్ స్పందిస్తూ…బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని,చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించిన న్యాయవాది రీగన్ ఆచార్యపై కిరాతకంగా దాడి చేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకొస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్మయ్ కృష్ణదాస్ కు అండగా నిలిచిన రమేశ్ రాయ్ అనే ఇంకో న్యాయవాదిపైనా,మరో మద్దతుదారుడిపైనా దాడి జరిగిందని రాధారమణ్ దాస్ పేర్కొన్నారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన న్యాయవాది ఫొటోను కూడా పంచుకున్నారు.ఇప్పుడా న్యాయవాది చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.