కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను ఈరోజు సాయంత్రం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ. 2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో ఏడు రకాల పరికరాలు అమర్చారు. వారంలో మూడు రోజులపాటు ఒక మండల పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రా సౌండ్, మొమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్ రే, కెమికల్ అనాలసిస్, కొలస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40 వేల మరణాలు అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ ప్రతినిధులను, చొరవ చూపిన ఎంపీ వల్లభనేని బాలశౌరిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హారి ప్రసాద్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సహా కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు,జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.

మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read

